News

Title

joel sutherland

Wednesday 22 July 2015

నాపేరు ఆజాద్.. స్వాధీన్ ....ఇల్లు జూలు

- బ్రిటిష్‌పాలిట సింహస్వప్నం చంద్రశేఖర్‌
- నేడు ఆజాద్‌ 109వ జయంతి
'నీ పేరేమిటి..?' 'నా పేరు ఆజాద్'.. 'తండ్రి పేరు..?' 'స్వాధీన్‌'.. 'నీ ఇల్లెక్కడ..?' 'కారాగారం'.. ప్రశాంతంగా సమాధానం చెప్తున్నాడు ఆ బాలుడు. ఇంతలోనే కోర్టులో 'భారత్‌మాతాకీ జై' అనే నినాదం పిక్కటిల్లింది. 

సహించలేని ఆ జడ్జి ఆ బాలుడిని చుస్తూ 16 కొరడాల దెబ్బలంటూ శిక్ష ప్రకటించాడు. బాలుడిపై కొరడా ఝుళిపిస్తుంటే శరీరమంతా రక్తసిక్తమైపోయింది. దెబ్బపడినప్పుడల్లా ఆ బాలుడు వందేమాతరం, భారత్‌మాతాకీ జై అంటూ నినదిస్తున్నాడు. అందుకే విప్లవవీరునిగా గుర్తించి కాశీ ప్రజలు 'ఆజాద్‌' అని పిలుచుకున్నారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌, పండిత్‌ రామ్‌ ప్రసాద్‌ బిస్మిల్‌ తదితరుల సహచరుడైన చంద్రశేఖర్‌ ఆజాద్‌ దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు. చిన్ననాటి నుండే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి, శత్రువులకు చిక్కకుండా తనకు తానే ఆత్మార్పణ చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయాడు. నేడు ఆయన జయంతి సందర్భంగా పలు విశేషాలు...

బాల్యంలోనే విప్లవబీజాలు
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నాఒ జిల్లా బాదర్క గ్రామంలో జూలై 23, 1906న మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పండిత్ సీతారాం తివారికి, అగరాణీదేవికి చంద్రశేఖర్‌ జన్మించారు. కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుణ్ని చేయాలనుకున్న తల్లిదండ్రుల ఒత్తిడిని భరించలేక 13వ యేటనే అతను ఇంటి నుండి పారిపోయాడు. ముంబయిలో ఒక మురికివాడలో ఉంటూ కూలి పని చేశాడు. అయితే 1921 లో వారణాసికి వెళ్లిపోయి అక్కడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు. అదే సమయంలో భారత స్వాతంత్రం కోసం మహాత్మ గాంధీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమంతో దేశం యావత్తు అట్టుడుకిపోతోంది. 15 ఏళ్ల చంద్రశేఖర్‌ కూడా ఉద్యమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. తాను చదువుతున్న సంస్కృత పాఠశాల ముందే ధర్నా చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెట్టారు. నీ పేరేమిటని జడ్జి అడిగితే.. ఆజాద్‌ అని, తండ్రి పేరడిగితే స్వాతంత్ర్యం అని, మీ ఇల్లెక్కడ అని అడిగితే జైలు అని తలతిక్క సమాధానాలు చెప్పాడు. దీంతో అతనికి 15 రోజుల జైలు శిక్ష విధించారు. అనంతరం శిక్షను రద్దు చేసి 15 కొరడా దెబ్బలను శిక్షగా విధించారు. ఆయన ఒంటిపై పడిన ప్రతి కొరడా దెబ్బ తన కర్తవ్యాన్ని గుర్తుచేసింది. దీంతో చంద్రశేఖర్‌ ఆజాద్‌గా మారిపోయాడు.
 స్నేహితుల కలిసి ఉద్యమాలు
తన స్నేహితుడైన రాంప్రసాద్ బిస్మిల్ మాటలతో ఆజాద్‌లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి. మిత్రుడైన బిస్మిల్, అఘ్నూల్ల ఖాన్ , రోషన్ సింగ్ లు ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలిసి అందులో భాగస్వామి అయ్యాడు. 1924 ఆగస్టు 9 న ఆకోరి వద్ద ప్రభుత్వ ధనం వున్న రైలును ఆపి దోచుకున్నారు. కొంత కాలానికి ఆ విప్లవ కారులంతా పోలీసుల చేతికి చిక్కారు. చంద్ర శేఖర్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఉత్తరప్రదేశ్ లోని ఓర్చా అరణ్యం లో సతార్ నది ఒడ్డున గల ఆంజనేయ స్వామి ఆలయం పక్కన ఓ కుటీరం నిర్మించుకుని మరిశంకర బ్రహ్మచారీ అనే సాధువు గా మారాడు. అక్కడి నుండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రణాళికలు రచించారు.  చంద్రశేఖర్ ఆజాద్ 1928 సెప్టెంబర్‌లో భగత్ సింగ్, సుఖ్ దేవ్‌తో కలిసి హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. 1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌ జరిగిన నిరసన ఉద్యమాల్లో లాలా లజపతి రాయ్‌ను బ్రిటీష్‌ పోలీసులు చంపేశారు. దీంతో రగిలిపోయిన విప్లవకారులు స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిని చంపాలనుకున్నారు. అయితే స్కాట్ అనుకొని సాండర్స్ అనే పోలీసు ను కాల్చారు. అనంతరం పారిపోతున్న భగత్ సింగ్, రాజ్ గురులను చనన్ సింగ్ అనే పోలీసు పట్టుకున్నాడు. స్నేహితులను కాపాడేందుకు చంద్ర శేఖర్ ఆజాద్.. చనన్ సింగ్ ను కూడా కాల్చేశాడు. అనంతరం వారంతా ఝాన్సీ పట్టణంలో ఓ ఇంట్లో రహస్యంగా గడిపారు. 1929 మే 2న ఝాన్సీ పట్టనాన్నంతా గాలించినా పోలీసులకు వారు పట్టబడలేదు.
 తనకు తానే ఆత్మార్పణ
 ఇంతలోనే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లు పార్లమెంటుపై దాడి చేయడం, వారిని పోలీసులు పట్టుకోవడం, న్యాయస్థానంలో వారి ఉరి శిక్ష పడడం వెనువెంటనే జరిగిపోయాయి. ఈ సంఘటనతో ఆజాద్ ఎంతో కలత చెందాడు. స్నేహితులను విడిపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 1931 పిబ్రవరి 27 తెల్లవారుజామున జవహర్ లాల్ నెహ్రూని కలిసి విప్లవవీరులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురులను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు ఆజాద్. కానీ నెహ్రూ ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పార్కులో ఇతర విప్లవ మిత్రులతో కలిసి భగత్ సింగ్‌ తదితరులను ఎలా విడిపించాలో చర్చిస్తున్నాడు. చర్చల్లో బ్రిటిష్‌ పోలీసులున్నారని గమనించిన ఆజాద్‌.. తన తుపాకీతో ముగ్గురు పోలీసులను మట్టుబెట్టాడు. ఇంకొందరు పోలీసులు అక్కడికి చేరుకుని ఆజాద్‌ను వెంబడించారు. కానీ చివరకు తన తుపాకీలో ఒక తూటానే మిగిలింది. అది ఒక్కరి ప్రాణాలను మాత్రమే తీయగలదు. అందుకే 'నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను' అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజంచేస్తూ పిస్తోలు తన కణతకు గురిపెట్టి పేల్చుకున్నాడు. ఈ సంఘటన జరిగిన 25 రోజుల తర్వాత భగత్ సింగ్‌ను ఉరితీశారు. ఆజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రలో ఎన్నటికీ మరిచిపోలేనిది. అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన ఆజాద్‌ నేటితరానికి చెందిన యువతకు స్ఫూర్తి.



https://www.youtube.com/watch?v=MHbAJZBTlgg&feature=youtu.be

No comments: